నవతెలంగాణ – ఢిల్లీ: అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవంతిని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ప్రధాన ద్వారం నుంచి పార్లమెంటు ఆవరణలోకి ప్రవేశించిన ప్రధానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్వాగతం పలికారు. అనంతరం గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఓం బిర్లా సమక్షంలో ఆవిష్కరించి నూతన పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితం చేశారు. అనంతరం పార్లమెంటు భవన నిర్మాణంలో పాల్గొన్న పలువురు కార్మికులను శాలువాతో సత్కరించారు. జ్ఞాపికలను బహూకరించారు. తర్వాత సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, అశ్వనీ వైష్ణవ్, జైశంకర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.