నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఒక యువకుడు ఎయిర్పోర్ట్లో వీల్చైర్ సహాయం కోరాడు. అనుమానించిన సిబ్బంది అతడ్ని తనిఖీ చేయగా 2.15 కేజీల బంగారంతో పట్టుబడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్కు చెందిన యువకుడు దుబాయ్లో పని చేస్తున్నాడు. రెండేళ్ల తర్వాత దేశానికి తిరిగివచ్చాడు. సోమవారం దుబాయ్ నుంచి విమానంలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే కాలికి గాయమైనట్లు నటిస్తూ వీల్చైర్ సహాయం కోరాడు. దీంతో ఆ యువకుడి తీరుపై సెక్యూరిటీ సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. అతడ్ని తనిఖీ చేయగా బూట్లలో దాచిన 2.15 కిలోల బంగారం లభించింది. దుబాయ్ నుంచి అక్రమంగా రవాణా చేసిన బంగారం పేస్ట్ విలువ రూ.1.13 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. కాగా, బంగారం స్మగ్లింగ్ కోసం కొందరు ట్రావెల్ ఏజెంట్లు తనను ఆశపెట్టినట్లు ఆ యువకుడు తెలిపాడు. దుబాయ్ నుంచి భారత్కు విమాన టికెట్ను ఇవ్వడంతోపాటు ఎయిర్పోర్ట్లో వీల్చైర్ సహాయం కోరమని సలహా ఇచ్చినట్లు కస్టమ్స్ అధికారులకు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆ యువకుడ్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజులపాటు రిమాండ్ విధించారు.