నవతెలంగాణ జైపూర్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఈడీ దాడులు చేపడుతోందని రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆందోళన వ్యక్తం చేశారు. సికార్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేస్తోందని, అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఈడీని కేంద్రం ఉసిగొల్పుతుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగుల రిక్రూట్మెంట్ పరీక్షల్లో ప్రశ్నా పత్రం లీకేజీ ఆరోపణలపై రాజస్ధాన్లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఈడీ సోదాలు చేస్తున్న సందర్భంలో గెహ్లాట్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈడీతో పాటు ఇతర ఏజెన్సీలు, దర్యాప్తు సంస్ధలు ఒత్తిడి కింద పనిచేస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగానికి కాషాయ పాలకులు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే ఆయా రాష్ట్రాలకు దర్యాప్తు సంస్ధలు దుర్వినియోగిస్తున్నారని దుయ్యబట్టారు. పాలకుల ఒత్తిడికి తలొగ్గి పనిచేయవద్దని తాను దర్యాప్తు సంస్ధలను కోరుతున్నానని సీఎం చెప్పారు. బీజేపీ నిత్యం కాంగ్రెస్ రహిత భారత్ గురించి మాట్లాడుతుందని, అయితే గెలుపు ఓటములు ఎలా ఉన్నా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం తమ బాధ్యతని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ప్రజలే నిర్ణయిస్తారని, ఎవరు సీఎం కావాలన్నది మీరే నిర్ణయించుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో తాము ప్రారంభించిన పథకాలు కొనసాగేందుకు తమను ఆశీర్వదించాలని ప్రజలకు గెహ్లోట్ విజ్ఞప్తి చేశారు.