నవతెలంగాణ – అమరావతి
నదిలో చేపల వేటకు వెళ్లేవారు అదృష్టంపై ఆధారపడి ఉంటుందంటారు. ఒక్కోసారి గంటల తరబడి కష్టపడ్డా ఖాళీ చేతులతోనే ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. అయితే, అంతర్వేదిలో మాత్రం ఓ జాలరి మాత్రం ఖాళీ చేతులతోనే అరుదైన చేపను ఒడిసిపట్టుకున్నాడు. ఒడ్డుకు దగ్గర్లో నీటిపై తేలుతూ వెళుతున్న చేపను నదిలో దూకి పట్టేసుకున్నాడు. ఈ అరుదైన కచిడీ చేపను వేలం వేయగా రూ.16 వేలకు అమ్ముడు పోయింది. దీంతో వారం రోజులు చేపల వేటలో కష్టపడితే వచ్చే సొమ్ము ఒక్క చేపతో వచ్చిందని ఆ జాలరి సంతోషం వ్యక్తం చేశాడు. సుమారు 4 కిలోల బరువున్న కచిడీ చేపను ఒడ్డుకు చేర్చిన మత్సకారుడు దానిని వేలం వేయగా పదహారు వేలకు అమ్ముడు పోయింది. ఈ చేపలను మందుల తయారీలో వాడతారని, బరువును బట్టి ఇవి ధర పలుకుతాయని జాలర్లు చెప్పారు. గోల్డ్ ఫిష్ గా వ్యవహరించే ఈ మగ కచిడి చేపకు డిమాండ్ ఎక్కువని వివరించారు. ఈ రకం చేపలు ఎక్కువగా కాకినాడ, అంతర్వేది దగ్గరలోనే దొరుకుతాయని చెప్పారు.