నవతెలంగాణ- కర్ణాటక: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి మంచి మనసు చాటుకున్నారు. యాసిడ్ దాడి బాధితురాలికి తన సచివాలయంలో ఉద్యోగం కల్పించాలని సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారు. సీఎం నివాసంలో జరిగిన ప్రజావాణికి వచ్చిన బాధితురాలు తన కష్టాల గురించి సిద్ధరామయ్యకు చెప్పింది. ఆ విషయాలను విన్న సీఎం సిద్ధరామయ్య అక్కడికక్కడే ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. బాధితురాలు గతేడాది 28న దాడికి గురైందని, ఆమె ఎంకామ్ గ్రాడ్యుయేట్ అని తెలిపింది. ఆమె తల్లిదండ్రులు కూడా జనతా దర్శన్ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి ఉద్యోగం కోసం విజ్ఞప్తి చేశారని పేర్కొంది.