నవతెలంగాణ – హైదరాబాద్
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో కరీంనగర్కు చెందిన మద్దెల శ్రీనివాస్, ఆయన కూతురు సాహితిని సిట్ అధికారులు బుధవారం 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య వారిద్దరికీ ఈ నెల 26 వరకు రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజశేఖరరెడ్డికి న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న మూడో పిటిషన్ను 4వ అదనపు సెషన్స్ కోర్టు ఇంచార్జి జడ్జి భూపతి డిస్మిస్ చేశారు. ఈ కేసులో మరో నిందితుడైన కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ మహబూబ్ బెయిల్ పిటిషన్ను జిల్లా జడ్జి కొట్టివేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో కళాశాల డైరెక్టర్ రోకొండ్ల వేంకటేశ్వర్లు, బసవవేణి శివకుమార్, బిర్రు నాగరాజును ఐదు రోజులపాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీచేశారు.