నవతెలంగాణ – సిరిసిల్ల
జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులు మందలించడంతో ఓ యువకుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెడలో ఉరితాడు పెట్టుకొని మరీ వీడియో తీసి బలవన్మరణం పొందాడు.ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని కమ్మరిపేట తండాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన భూక్య రాజు, జ్యోతి దంపతులకు ఒక కుమారుడు దినేష్ (17), కూతురు దీపిక ఉన్నారు. దంపతులు ఇద్దరు కూలీ పని చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నారు. కొంతకాలంగా దినేష్ స్కూల్ మానేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయాన్నే తండాలోని ఓ కిరాణ షాపునకు వెళ్లి దినేష్ సిగిరెట్ డబ్బా దొంగతనం చేశాడని కిరాణ షాపు యజమాని ఇంటికి వచ్చి గొడవకు దిగింది. ఈక్రమంలో దినేష్ను తల్లిదండ్రులు మందలించడంతో పాటు పరువు తీస్తారనే అవమానంతో ఇంట్లో నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయాడు. వట్టిమల్ల గ్రామశివారులోని దుర్గమ్మ ఒర్రె దగ్గర గల గుట్టబోరుకు చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. సాయంత్రమైనా ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు వెతుకగా రాత్రి సమయంలో ద్విచక్ర వాహనాన్ని గుర్తుపట్టి అక్కడికి వెళ్లి చూసే సరికి చెట్టుకు ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రి భూక్య రాజు ఫిర్యాదు మేరకు కిరాణ షాపు యజమానురాలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమాకాంత్ తెలిపారు.