![గుంతల నుండి వాహనం వెళ్లాలంటే శ్రమదానం చేసుకోవాల్సిందే](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/roads-1-300x189.jpg)
– మీరు ఎక్కడికైనా వెళ్తారా అయితే శ్రమదానం చేసుకోండి
– అష్ట కష్టాలు పడవలసి వస్తున్న ప్రజలు
నవతెలంగాణ మద్నూర్
భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏండ్లు గడిచింది. అయినా కూడా గ్రామాలకు రోడ్ల అభివృద్ధి జరగకపోవడం విషాదం. పల్లె ప్రజలు ఇంటి నుండి బయటకు వెళ్లాలన్నా బయట నుండి ఇంటికి రావాలన్నా గుంతల మయంగా మారిన రోడ్లకు శ్రమదానం చేయవలసింది. రాళ్లు రప్పలు వేసి రోడ్డు దాటవలసిన పరిస్థితి. లేకపోతే వాహనం గుంతల నుండి వెళ్లలేని పరిస్థితి. మండలంలోని ఒక గ్రామానికి గల రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారడంతో కారులో వెళ్లే ప్రయాణికులు పెద్దపెద్ద గుంతలలో రాళ్లు రప్పలు వేసి రోడ్డుకు శ్రమదానం చేయాల్సిన పరిస్థితి. అలా వాహనాన్ని తీసుకువెళ్లే దృశ్యాలు చూస్తే ఇక మద్నూర్ మండలంలోని పలు గ్రామాల రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో అనే దానికి ఈ దృశ్యాలే నిదర్శనం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందంటూ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటే మన నిధులు మనకే ఉంటాయి. నీళ్లు, నియామకాలు కూడా మనవి మనకే ఉంటాయి. ఆంధ్ర వాళ్ళతో మోసపోతున్నాం. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటే అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటాం. ఈ నినాదాలతో తెలంగాణ ప్రాంత ప్రజలంతా ఏకమై సకల జనుల సమ్మెతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం గడిచిన 10 ఏండ్లల్లో చేసిన అభివృద్ధి ఎక్కడ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వెనుకబడ్డ జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ మండల పల్లె గ్రామాల రోడ్లు అద్వానంగానే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పల్లె గ్రామాల రోడ్లకు అభివృద్ధి పరిచి ప్రజల కష్టాలను దూరం చేయాలని గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.