– సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ
– సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత
నవతెలంగాణ-పరిగి
కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎంలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ అన్నారు. కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎంలను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని, రాష్ట్రంలో కాంట్రాక్టు విధానం రద్దు చేయాలని, అధిక పనిభారం తగ్గించాలని, అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. వివిధ అంశాలపై శుక్రవారం ఎమ్మెల్యే మహేశ్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం రామకృష్ణ, తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి లలిత పాపమా మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్లో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అందర్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు చెప్పిన విధంగా అందరినీ పర్మినెంట్ చేయాలని పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. అందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, 11వ పీఆర్సీ ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. యూనిఫామ్కు 2,500 రూపాయలు ఇవ్వాలని, 180 మెడికల్ లివ్లు ఇవ్వాలని, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో రజియా, సలీమా, కవిత, కాంతమ్మ, సత్యమ్మ, సుజాత, పుష్ప, అనురాధ, అంజమ్మ, ప్రమీల, తదితరులు పాల్గొన్నారు.