నవతెలంగాణ-శంషాబాద్
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విదేశాల నుంచి అక్రమ బంగారం తరలింపు ఆగడం లేదు. తాజాగా ఆదివారం మళ్లీ బంగారం పట్టుబడింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రియాద్ నుంచి ఇద్దరు ప్రయాణికులు షేక్ ఖాజా రెహమతుల్లా, షేక్ జానీభాష ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వారు బంగారాన్ని రహస్యంగా డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్లలో దాచుకొని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. సుమారు రూ.60 లక్షల విలువచేసే 24 క్యారెట్ల విలువైన 931 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శనివారం ఎనిమిది కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్న విషయం విదితమే. ఒక్క రోజు వ్యవధిలోనే మరో కిలో బంగారం పట్టుబడటం గమనార్హం.