నవతెలంగాణ – హైదరాబాద్
పరిపాలన సౌలభ్యం కోసం ప్రజల అవసరాలకు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరడానికి కొత్త జిల్లాల ఏర్పాటు అవసరమే. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అడిగిన అడగకపోయినా అవసరం ఉన్న లేకపోయినా కొత్త జిల్లాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినారు. సిరిసిల్ల వంటి అతి చిన్న జిల్లాను కూడా జిల్లా కేంద్రంగా ప్రకటించిన అధికార టిఆర్ఎస్ పార్టీ నాయకులకు అన్ని అర్హతలు ఉండి 13 మండలాలతో ఏర్పాటు కానున్న హుజరాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు విషయం మౌనం వహిస్తున్నారని తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల రాజేషం అన్నారు. గత ఎన్నికల్లో ఏర్పాటు కావాల్సిన జిల్ల ఏర్పాటు ప్రకటన ఆగిపోయింది. ఇప్పుడు కొత్త మండలాలు.రెవెన్యూ డివిజన్లు ఇస్తున్నారు కాబట్టి మరోసారి తెరపైకి ముజురాబాద్ జిల్లా డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. తెలంగాణ ప్రాంతంలోని ప్రజలందరూ ఏకమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విధంగానే రానున్న ఎన్నికల్లో పోరాటం చేసి హుజూరబాద్ పీవీ జిల్లా నుసాధించుకోవడానికి సిద్ధమవుతున్నారు. భారతదేశ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జ్ఞాపకార్థం ప్రజల సౌకర్యార్థం కచ్చితంగా హుజూరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయాల్సిందే. ఈ ప్రాంత ప్రజలకే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి కూడా హుజురాబాద్ జిల్లా ఏర్పాటు చారిత్రక రాజకీయ అవసరమన్నారు.
హుజురాబాద్ నియోజకవర్గం నుండి పాలకపక్షమైన భారత రాష్ట్ర సమితి తమ అభ్యర్థిని ప్రకటించి ముందువరుసలో నిలవగా, ప్రతిపక్షపార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీలతోపాటు మరికొన్ని పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమై ఉన్నాయి. హుజురాబాద్ నియోజకవర్గం నుండి వచ్చే ఎన్నికల్లో పోటీచేసే వివిధ పార్టీలు, ఆయా పార్టీల తరఫున పోటీచేయబోతున్న అభ్యర్థుల ముందుకు హుజురాబాద్ కేంద్రంగా మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు పేర జిల్లా ఏర్పాటు ప్రధానంగా ప్రజల డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభించిన నాటి నుండి హుజురాబాద్ కేంద్రంగా పి.వి.జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 2016 నుండి 2020 వరకు హుజురాబాద్ అంబేద్కర్ కూడలి వద్ద పి.వి.జిల్లా సాధన కమిటీ, తెలంగాణ జె.ఏ.సి.ల నాయకత్వంలో ఎందరోఅనేక రకాల ఉద్యమాలను చేశారు.ప్రజా ప్రతినిధులందరికి పలుమార్లు కలసి విజ్ఞాపనలు చేయడం జరిగింది.
హుజురాబాద్ కేంద్రంగా పి.వి.జిల్లా ఏర్పాటు కోసం 2016 నుండి వివిధ దశల్లో ప్రజలు కొనసాగించిన ఉద్యమాలను, అలాగే జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను వివరిస్తూ 2018 లో హుజురాబాద్ జె.ఏ.సి భారీ ఎత్తున కరపత్రాలను ప్రజల్లో విస్తృతంగా పంపిణీ చేసింది. ఇప్పటికి కూడా హుజురాబాద్ కేంద్రంగా పి.వి.పేరుతో జిల్లాను ఏర్పాటు చేసే అవకాశముంది. కాకతీయుల రాజాధానిగా కొనసాగిన చారిత్రాత్మకమైన వరంగల్ పట్టణాన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసి హన్మకొండ కేంద్రంగా ఒకే చోట రెండు జిల్లా కేంద్రాలను నిర్వహిస్తున్న విషయంలో ప్రభుత్వంలోని పెద్దలు ఆలోచనచేయాలన్నారు. శతాబ్దాల తరబడి ఒకే ప్రాంతంగా భాసిల్లిన కాకతీయులు నిర్మించిన చారిత్రాత్మకమైన వరంగల్ కోటను, వేయి స్తంభాల దేవాలయాన్ని ఒకే కేంద్రంలో నిర్వహిస్తున్న వరంగల్, హన్మకొండ జిల్లాలకు విడదీయడం న్యాయమా??. వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాలను ఒకే జిల్లావాసులుగా అనుభూతిని పొందిన ప్రజలకు తాము ఒకే కేంద్రంలో జీవిస్తున్నా వేర్వేరు జిల్లాలకు చెందిన వారమనే మానసిక వ్యధకు గురౌతున్న మాట వాస్తవమన్నారు. వరంగల్, హన్మకొండ రెండు జిల్లాలుగా కొనసాగుతున్న హన్మకొండ జిల్లాలోని కమలాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు ఒకప్పటి హుజురాబాద్ తాలుకాకు చెందినవే. అలాగే 2009 వరకు హుజురాబాద్ నియోజకవర్గం. పి.వి. నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని హుజురాబాద్ నుండే ప్రారంభించారు. 1952 లో జరిగిన తొలి లోకసభ ఎన్నికల్లో పి.వి. కరీంనగర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు. ఆయన పార్టీ లోకసభ అభ్యర్థిత్వాన్ని అప్పటి సీతారాంనాయుడు నాయకత్వంలోని హుజురాబాద్ తాలూకా కాంగ్రెస్ కమిటీ ప్రతిపాదించడం జరిగింది.
పి.వి. స్వగ్రామమైన వంగర హుజురాబాద్ కు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హుజురాబాద్ కేంద్రంగా పి.వి.జిల్లా ఏర్పాటు విషయాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్, అప్పటి రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు, అప్పటి లోక సభ సభ్యులు వినోద్ కుమార్ లు హుజురాబాద్ జిల్లా డిమాండ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంలో విఫలమయ్యారన్న భావన ఇప్పటికి ప్రాంత ప్రజల్లో ఉంది. ఈ విషయంలో వీరిమధ్య సమన్వయ లోపం వల్లనే హుజురాబాద్ జిల్లా ఏర్పాటు జరగలేదని కూడా ఇక్కడి ప్రజల అభిప్రాయం. అలాగే జిల్లా ఏర్పాటు కోసం జరిగిన ప్రజా ఉద్యమాల్లో కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఐ(ఎం), టీడీపీ పార్టీలు జిల్లా సాధన కమిటీతోను, జె.ఏ.సీతోను కలసి నామమాత్రంగా పనిచేసాయే తప్ప ఆ పార్టీలు జిల్లా ఏర్పాటు కోసం స్వతహాగా ఉద్యమించిన సందర్భం లేదు. ఆ పార్టీలు కూడా జిల్లా ఏర్పాటు విషయాన్ని పట్టించుకోలేదని ప్రజలు భావిస్తున్నారు.
33 జిల్లాల సంఖ్యను పెంచకుండానే వరంగల్ జిల్లా ప్రాముఖ్యతను తగ్గించకుండా వరంగల్ జిల్లా పరిధిని పెంచి, హన్మకొండ జిల్లా కు బదులుగా హుజూరాబాద్ కేంద్రంగా పి.వి.జిల్లాను ఏర్పాటు చేయాలి. పూర్వపు హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్ మండలాలు, ప్రస్తుత హుజురాబాద్ నియోజవర్గంలోని ఐదు మందళాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం, వి.సైదాపూర్ మండలాలు, జయశంకర్-
భూపాలపల్లి జిల్లాలలోని మొగుళ్ల పల్లి, టేకుమట్ల మొత్తం 13మండలాలతో కూడి, హుజురాబాద్ కేంద్రంగా పి.వి.జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రజలు అప్పుడు కోరారు, ఇప్పుడు కోరుకుంటున్నారు. అదేవిధంగా హుజురాబాద్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసి జమ్మికుంట, ఎల్కతుర్తి కేంద్రాలలో రెవిన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయాలని కూడా స్థానికులు కోరుకుంటున్నాట్టు తెలిపారు. హుజురాబాద్ కేంద్రంగా పి.వి.జిల్లా ఏర్పాటు విషయాన్ని వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అన్ని రాజకీయపార్టీల ముందు ప్రధాన ప్రజల ఎజెండాగా ఉంది. హుజురాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు కావాలని అడగడం అత్యాశ అసలేకాదు.
హుజురాబాద్ ప్రాంత అభివృద్ధి జిల్లా ఏర్పాటు వల్లనే జరుగుతుందని ఈ ప్రాంత ప్రజల భావన కూడా.. హుజురాబాద్ కేంద్రంగా పి.వి.పేరిట జిల్లా ఏర్పాటు ఈ ప్రాంత ప్రజల బలమైన ఆకాంక్ష.
– రావుల రాజేశం (లెక్చరర్)
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తెలంగాణ సామాజిక రచయితల సంఘం.9848811424