నవతెలంగాణ – హైదరాబాద్: దేశ ప్రజలంతా ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో పార్టీ విజయాలే దీనికి స్పష్టమైన రుజువని అన్నారు. హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సభ్యులతోపాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్లమెంటు సభ్యులు, సమావేశాన్ని ఉద్దేశించి ఖర్గే ఆదివారం ప్రసంగించారు. వ్యక్తిగత ప్రయోజనాలు, విభేదాలను పక్కన పెట్టి.. పార్టీ విజయానికి ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సంస్థాగత ఐక్యత చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఐక్యత, క్రమశిక్షణ ద్వారా మాత్రమే ఇతర పార్టీలను ఓడించగలమని స్పష్టం చేశారు. ‘ఇది మనం విశ్రాంతి తీసుకునే సమయం కాదు. గత పదేళ్లలో బీజేపీ పాలనలో సామాన్య ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. పేదలు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత సమస్యలను పరిష్కరించడంలో మోడీ విఫలమయ్యారు. ఆత్మవిమర్శ చేసుకోవడంలేదు’ అని విమర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ ఐక్యతతో ఈ నియంతృత్వ ప్రభుత్వానికి తెరదించాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికై 2024 నాటికి శతాబ్ది కాలం పూర్తి కావస్తోందని.. ఈ తరుణలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి గద్దె దించడమే మహాత్ముడికి సరైన నివాళి అని చెప్పారు.