నవతెలంగాణ- హైదరాబాద్: విధ్వంసం సృష్టించిన న్యూజిలాండ్ బ్యాటర్లు. కివీస్ ధాటికి ఇంగ్లండ్ జట్టు పసికూనలా మారింది. 283 పరుగుల టార్గెట్ ను కేవలం ఒక వికెట్ కోల్పోయి 36.2 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో డేవాన్ కాన్వే (121 బంతుల్లో 152 పరుగులు నాటౌట్; 19 ఫోర్లు, 3 సిక్సర్లు), రచీన్ రవీంద్ర (96 బంతుల్లో 123 పరుగులు నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీలతో విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి ధాటికి మరో 82 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కర్రన్ కి ఒక వికెట్ దక్కింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ జట్టుకు ఇది భారీ ఓటమి. 283 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. సామ్ కర్రన్ బౌలింగ్ లో.. విల్ యంగ్ డకౌట్ గా వెనుదిరిగాడు. అయితే.. ఈ ఆనందం ఇంగ్లండ్ జట్టుకు ఎంతో సేపు నిలవలేదు. వన్ డౌన్ లో వచ్చిన రచీన్ రవీంద్ర.. మరో ఓపెనర్ డేవాన్ కాన్వేతో కలిసి పరుగుల వరద పారించాడు. ఈ ఇద్దరూ పోటీ పడీ మరి బౌండరీలు బాదారు. వీరి దెబ్బకి ఇంగ్లండ్ బౌలర్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఏ బంతి వేసినా.. ఎలా వేసినా బాదుడే అన్నట్టుగా ఈ ఇద్దరి బ్యాటింగ్ సాగింది. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. హాఫ్ సెంచరీల తర్వాత కూడా ఇద్దరూ విజృంభించారు.