నవతెలంగాణ–న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యంతో తల్లడిల్లుతోంది.. గాలి పీల్చుకునేందుకు జనం జంకుతున్నారు. ఒకవేళ దీపావళి తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగితే, ఆ సమస్యను పరిష్కరించేందుకు ఢిల్లీ సర్కారు ఓ కొత్త ప్లాన్ వేసింది. కృత్రిమ వర్షం(Artificial Rain)తో గాలిలో ఉన్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నించనున్నది. ఆ కృత్రిమ వర్షం ఏంటో దాని గురించి కొంచం తెలుసుకుందాం. ఢిల్లీ నగరంపై కృత్రిమ వర్షం కురిపిస్తామని ఆ రాష్ట్ర మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ఈ పద్ధతిలో ప్రయత్నించనున్నట్లు ఆయన వెల్లడించారు. నవంబర్ 20, 21 తేదీల్లో ఒకవేళ ఆకాశం మసకబారిపోతే, ఆ సమయంలో క్లౌడ్ సీడింగ్ జరపనున్నట్లు ఆయన తెలిపారు. వాయు నాణ్యతను పెంచే ఉద్దేశంతో ఈ చర్యను చేపట్టనున్నారు. కృత్రిమ వర్షాన్నే క్లౌడ్ సీడింగ్ అంటారు.. కృత్రిమ వర్షాన్ని కురిపించేందుకు కాన్పూర్ ఐఐటీ( IIT Kanpur) సంస్థతో ఢిల్లీ సర్కార్ మంతనాలు జరిపింది. ఆ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మణింద్ర అగర్వాల్ దీనిపై మాట్లాడారు. తమ వద్ద ఓ ప్రత్యేకమైన విమానం ఉందని, దానికి క్లౌడ్ సీడింగ్ పదార్ధాలు ఉంటాయని, డీజీసీఏ అనుమతితో ఆ విమానం ఎగురుతుందని ఆయన తెలిపారు. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఉన్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ పద్దతిని వినియోగించనున్నట్లు ప్రొఫెసర్ చెప్పారు. కృత్రమ వర్షం వల్ల గాలిలో ఉన్న దుమ్ము, ధూళి సెటిల్ అవుతుందని, నీటితో ఆ డస్ట్ కొట్టుకుపోతుందని, దీంతో పర్యావరణం క్లీన్ అవుతుందని ఆయన తెలిపారు.