నవతెలంగాణ – హైదరాబాద్ : బోరబండ.. రాజ్నగర్లో 34 ఏళ్ల జ్యోతి… పెద్దలు కుదిర్చిన మేనరిక సంబంధం చేసుకోవడమే తప్పైపోయిందని నిపుణులు అంటున్నారు. ఆమె తన సొంత బావ, కాంట్రాక్టర్ అయిన విజయ్ని పెళ్లి చేసుకుంది. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారికి ఆర్థిక సమస్యలు కూడా లేవు. నాలుగేళ్ల అర్జున్, రెండేళ్ల ఆదిత్యతో ఆ కుటుంబం ఆనందంగా ఉండేదే.. కానీ విధి వారిని వంచించింది. విషాదంలో ముంచేసింది. ఇద్దరు పిల్లల్లో పెద్దబ్బాయికి బుద్ధిమాంద్యం, మాటలు రాలేదు, చిన్న పిల్లాడికి అంగవైకల్యం, నడవలేని పరిస్థితి. పిల్లల కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. చికిత్స అందిస్తున్నా, ఫలితం కనిపించట్లేదు.ఇదంతా మేనరికం వల్లే వచ్చిందని అర్థమైంది. కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితిలో రోజూ దిగులు చెందుతూ ఉండేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో చిన్నగా మనస్పర్థలు మొదలై.. రాన్రానూ అవి ఎక్కువయ్యాయి. తాజాగా జ్యోతి మామ ఆమెతో గొడవపడ్డాడు. ఆ ఘటన ఆమెను తీవ్రంగా కలచివేసింది. ఇక ఈ లోకంలో ఉండలేను అనుకుంది. కానీ తాను ఒంటరిగా చనిపోతే, పిల్లలు దిక్కులేనివారు అవుతారని భావించింది. అందుకే వారిని చంపేసి, తర్వాత తానూ ఆత్మహత్య చేసుకుంది. ఇదంతా చూసి.. విజయ్ కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. అతన్ని బంధువులు ఆస్పత్రికి తరలించారు. ఇలా మేనరిక సంబంధం ఈ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఇంకా ప్రపంచాన్ని చూడని ఇద్దరు పిల్లలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. జ్యోతి ఆత్మార్పణం చేసుకుంది. విజయ్ బతికే ఉన్నా.. ఈ విషాదం అతన్ని జీవితాంతం బాధిస్తూనే ఉంటుంది. మేనరిక సంబంధాల వల్ల జన్యపరమైన సమస్యలు వస్తాయంటున్న నిపుణులు.. అలాంటి సంబంధాలకు దూరంగా ఉండటమే మంచిదంటున్నారు. ఇలాంటి పెళ్లిళ్ల విషయంలో పెద్దలు కూడా బలవంతపెట్టవద్దని కోరుతున్నారు.