– సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్
నవతెలంగాణ-తంగళ్ళపల్లి : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, సిరిసిల్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అమర జీవి కామ్రేడ్ అమృత్ లాల్ శుక్లా విగ్రహాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు.తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో బాగంగా శనివారం తంగళ్ళపల్లి మానేరు నది ఒడ్డున ఉన్న ఆయన స్థూపానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సెప్టెంబర్ 10 నుండి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. భూమికోసం , భుక్తి కోసం , వెట్టి చాకిరి విముక్తి కోసం ఆనాడు నైజాం నిరంకుశ పాలనలో భూస్వాములు , రజాకార్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో మట్టి మనుషులు చేసిన మహోన్నత పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమన్నారు. ఆనాటి పోరాటంలో మన జిల్లా నుండి బద్దం ఎల్లారెడ్డి , సింగిరెడ్డి భూపతి రెడ్డి , అమృత లాల్ శుక్ల , గడ్డం తిరుపతిరెడ్డి , కర్రోల్ల నర్సయ్య లు పాల్గొన్నారని వివరించారు.అమృత లాల్ శుక్లా తన ఉపాధ్యాయ వృత్తిని సైతం వదులుకొని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను చైతన్యం చేస్తూ పోరాటంలో కీలక పాత్ర పోషించారన్నారు. అందుకే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కామ్రేడ్.. అమృత్ లాల్ శుక్లా విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కోడం రమణ. జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ , మల్లారపు ప్రశాంత్ , శ్రీరాముల రమేష్ చంద్ర , నర్సయ్య , మల్లయ్య , శ్రీనివాస్ , రాకేష్ , సురేష్ , గంగాధర్ , శంకర్ , రాజమల్లు , పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.