నవతెలంగాణ – కేరళ
కేరళలోని అలప్పుజాలో స్వేచ్ఛగా జీవించే అమీబా కారణంగా అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకి ఓ యువకుడు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అలప్పుజాలోని పానవల్లి తీర ప్రాంతానికి చెందిన పదిహేనేళ్ల బాలుడు ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ అనే వ్యాధి బారినపడ్డాడు. బాలుడి మరణాన్ని మంత్రి ధృవీకరించారు. అలాగే రాష్ట్రంలో ఇంతకుముందు ఐదు అరుదైన ఇన్ఫెక్షన్ కేసులు నమోదైనట్లు తెలిపారు. తొలిసారిగా 2016లో అలప్పుజాలోని తిరుమల వార్డులో నమోదైనట్లు తెలిపారు. మలప్పురంలో 2019, 2020లలో రెండు కేసులు నమోదయ్యాయని, 2020లో కోజికోడ్, 2022లో త్రిసూర్లో నమోదైనట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు జ్వరం, తలనొప్పి, వాంతులు. ఈ వ్యాధి సోకిన వారంతా మృతి చెందినట్లు చెప్పారు. తద్వారా ఈ అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ మరణాల రేటు 100 శాతంగా ఉంది. ఇన్ఫెక్షన్కు కారణమయ్యే స్వేచ్ఛా జీవి అమీబా నిశ్చల నీటిలో కనిపిస్తాయని మంత్రి తెలిపారు. డాక్టర్లు చెప్పిన వివరాల ప్రకారం… స్వేచ్ఛా జీవి, నాన్-పారాసిటిక్ అమీబా బ్యాక్టీరియా ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు మనిషి మెదడుకు ఇన్ఫెక్షన్ వస్తుంది.