నవతెలంగాణ – పాకిస్థాన్
గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల మూడంతస్తుల భవనం కుప్ప కూలి ఆరుగురు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. ఈ ఘటన పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఆదివారం ఉదయం 9.45 గంటలకు జరిగింది. పంజాబ్ ప్రావిన్స్లోని జీలం గ్రాండ్ ట్రంక్ రోడ్లో ఉన్న ఓ హోటల్లోని వంట గదిలో సిలిండర్ పేలింది. దీంతో మూడు అంతస్తుల భవంతి కుప్పకూలింది. ప్రమాద సమయంలో శిథిలాలు మీద పడి ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 10 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జీలం జిల్లా ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఆస్పత్రిలో ఎమర్జెన్సీ విధించి మొత్తం సిబ్బంది, వైద్యులను విధుల్లోకి చేర్చారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో క్షతగాత్రుడిని రావల్పిండిలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించినట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. ఈ మేరకు జీలం డిప్యూటీ కమిషనర్ సమీవుల్లా ఫరూక్ వివరాలు వెల్లడించారు. ‘మా సహాయక బృందాలు రెస్క్యూ చర్యలు కొనసాగిస్తున్నాయి. శిథిలాల కింద నలుగురైదుగురు వ్యక్తులు ఉండవచ్చు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది’ అని సమీవుల్లా తెలిపారు. శిథిలాలను తొలగించేందుకు భారీ యంత్రాలను వినియోగిస్తున్నట్లు జీలం పోలీసులు తెలిపారు.