– ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీ అమలు చేస్తాం
– టిఆర్ఎస్ పాలనలో ప్రజలు గోసపడుతున్నారు
– తెలంగాణ కల నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి
– కాటారం బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
నవతెలంగాణ- కాటారం
దొరల తెలంగాణ ప్రజల తెలంగాణ మధ్య యుద్ధం జరుగుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. భూపాల్ పల్లి జిల్లా కాటారంలో గురువారం జరిగిన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని బిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బిజెపి,బి ఆర్ ఎస్ ఎంఐఎం మూడు పార్టీలు ఒకటయ్యాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాష్ట్రంలోని టిఆర్ఎస్ పాలన కేంద్రంలోని నరేంద్ర మోడీ రిమోట్ కంట్రోల్ గా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. నాపై కేసులు పెట్టి ఇల్లు తీసుకొని లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేశారని తెలిపారు. పార్లమెంటులో బిజెపికి టిఆర్ఎస్ మద్దతుగా ఉంటుందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాల మీద సిబిఐ, ఈడి, ఐటి దాడులు ఉంటాయి కానీ, తెలంగాణలో అవినీతి చేస్తున్న కెసిఆర్ మీద సిబిఐ, ఈడి, ఐటి దాడులు ఎందుకు కావడం లేదు అని ప్రశ్నించారు.దేశంలో కుల గణనా చేపట్టాలని సర్వేలు చేయాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఈ విషయాన్ని పార్లమెంట్ లో కూడ అడిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. దేశంలో ఐదు శాతం అధికారులు మాత్రమే బడ్జెట్ ను నియంత్రిస్తున్నారని ఆయన చెప్పారు.అందరిని పాలనలో భాగస్వామ్యం చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.90 మంది కీలక అధికారుల్లో ఎంతమంది బీసీలున్నారని తాను పార్లమెంట్ లో అడిగినట్టుగా రాహుల్ గాంధీ చెప్పారు. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ అధికారులు ఎంతమంది ఉన్నారని కూడ తాను పార్లమెంట్ లో లేవనెత్తినట్టుగా రాహుల్ తెలిపారు.రైతులకు కార్మికులకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. దేశంలో ఆదానిలాంటి పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్లు అప్పు తీసుకుంటే వారు అడగకుండానే రుణమాఫీ చేస్తున్నారని, రైతులు, మహిళలు, యువకులు రుణాలు తీసుకుంటే రుణమాఫీ ఎందుకు చేయరు అని ప్రశ్నించారు. ప్రజల డబ్బంతా బిజెపి ఆదానికి అప్పగిస్తుందని తెలిపారు. దేశ సంపద ఎవరి వద్ద ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వెలికి తీసి ప్రతి పేద కుటుంబాలకు అందజేస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చారు పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పినా ఆయన ఎంతమందికి ఇల్లు కట్టించారు. రూ. లక్ష వరకు రుణమాఫీ అని చెప్పిన సీఎం ఆ మాఫీ చేయలేదు అని అన్నారు. కర్ణాటక, రాజస్థాన్, చతిస్గడ్, హిమాచల్ ప్రదేశ్లలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలను నెరవేర్చామని తెలిపారు.రాజస్థాన్ లో రు.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేస్తున్నామని , దేశంలో ఎక్కడా లేని మెరుగైన వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. చతిస్గడ్ రాష్ట్రంలో రుణమాఫీ చేశామని తెలిపారు.చతిస్గడ్ రాష్ట్రంలో క్వింటాల్ ధాన్యానికి రు.2500 చొప్పున కొంటమని హామీ ఇచ్చి అమలు చేశామని తెలియజేశారు.దేశంలో ధాన్యానికి అత్యధిక గిట్టుబాటు ధర చత్తీస్గడ్ రైతులకు అందుతుందని, కర్ణాటకలో ఎన్నికల సమయంలో ఇచ్చిన ఐదు గ్యారంటీ లిచ్చి వాటిని తొలి మంత్రి మండల్ సమావేశంలో ఆమోదించి అమలు చేస్తున్నామని తెలిపారు. కర్ణాటకలో మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని, ప్రతి నెల రైతులు, మహిళలకు బ్యాంకు నేరుగా డబ్బు జమవుతుందని తెలిపారు.తెలంగాణ కోసం ఎంతోమంది జీవితాలు త్యాగం చేశారని, తెలంగాణ ప్రజల కలలను కాంగ్రెస్ అర్థం చేసుకొని, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చిందని కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా పాలన జరుగుతుందని మండిపడ్డారు. తెలంగాణ కల నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత బట్టి విక్రమార్క, తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు