నవతెలంగాణ – విశాఖ
అంతర జిల్లాల న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్ ఆడుతూ విశాఖకు చెందిన న్యాయవాది మృతి చెందారు. ఈనెల 16వ తేదీ నుంచి విశాఖ నగరంలోని పలు స్టేడియాల్లో న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్ జరుగుతోంది. విశాఖ జగదాంబకూడలి ప్రాంతానికి చెందిన న్యాయవాది మణికంఠనాయుడు (26) బి-టీం తరఫున ఆడుతున్నారు. ఆదివారం గాజువాక జింక్ మైదానంలో మ్యాచ్ పూర్తయిన తర్వాత మణికంఠనాయుడు మైదానం నుంచి బయటకు వస్తుండగా అస్వస్థతకు గురై పడిపోయాడు. సహచరులు ఎంతగా ప్రయత్నించినా చలనంలేదు. 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి చూడగా అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. స్థానికుల సాయంతో మృతదేహాన్ని గాజువాకలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. మణికంఠనాయుడికి గుండెవ్యాధి ఉందని, ఈ కారణంతోనే మృతి చెందాడని విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతపల్లి రాంబాబు తెలిపారు. విశాఖలో గత వారం రోజుల నుంచి 40 డిగ్రీల సెల్సియస్కుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. ఈ సమయంలో న్యాయవాదుల మధ్య మ్యాచ్లు నిర్వహించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.