![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/IMG_20230805_173819.jpg)
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయిల్ ఫాం సాగు విస్తరణను వేగవంతం చేయాలని ఆయిల్ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. వానాకాలంలో నిర్దేశించిన లక్ష్యాన్ని గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మండలంలోని నారంవారిగూడెం కార్యాలయంలో శనివారం సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.రైతులకు అవసరమైన మొక్కలు నర్సరీలో అందుబాటులో ఉన్నాయని,గతంలో మాదిరిగా మొక్కల కొరత లేదని చెప్పారు.సాగు ప్రయోజనాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న రాయితీ పథకాల పైనా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇతర పంటల మాదిరిగా విక్రయాల్లో రైతులకు ఇబ్బందులు ఉండవని,నేరుగా ఆయిల్ఫెడ్ పంట దిగుబడిని కొనుగోలు చేసి ప్రకటించిన మద్దతు ధర రవాణా చార్జీలతో సహా చెల్లించటం జరుగుతుందని అన్నారు. అలాగే ఇప్పటికే ఆయిల్ ఫాం సాగు చేస్తున్న రైతులకు పక్వానికి వచ్చిన గెలలు ను మాత్రమే ఫ్యాక్టరీకి తరలించాలని, లేత గెలలు తరలించడం వల్ల ఆయిల్ రికవరీ పై ప్రభావం ఉంటుందని, ఫలితంగా గెలలు ధర పడిపోతుందని,ఈ విషయాన్ని రైతుల్లో కి తీసుకెళ్ళాలని చెప్పారు.ప్రభుత్వం జారీ చేసిన పోడు భూములకు కూడా రాయితీ పథకాలు అమలు అవుతాయని,కొత్తగా పట్టాలు తీసుకున్న గిరిజన రైతులకు సాగుపై అవగాహన కల్పించాలని అన్నారు. సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల ఫీల్డ్ ఆఫీసరు మహేష్, అప్పారావు, ఫణి కుమార్ పాల్గొన్నారు.