నవతెలంగాణ – హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలను నిర్వహించనున్నట్టు రాష్ట్ర విద్యాశిక్షణా పరిశోధన సంస్థ (ఎస్సీఈఆర్టీ) తెలిపింది. బుధవారం నుంచి 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు. పేపర్ -1ను డీఐఈడీ, బీఈడీ అభ్యర్థులు రాసుకోవచ్చు. బీఈడీ అర్హత కలిగిన వారు పేపర్ -2తోపాటు పేపర్-1కు కూడా హాజరుకావొచ్చు. బీఈడీ, డీఐఈడీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా టెట్ రాయొచ్చు. ఫలితాలను సెప్టెంబర్ 27న విడుదల చేస్తామని ఎస్సీఈఆర్టీ వెల్లడించింది. ఇటీవలే నిర్వహించిన విద్యాశాఖ మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో టెట్ నిర్వహణకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఎస్సీఈఆర్టీ అధికారులు టెట్ నిర్వహణపై ప్రతిపాదనలు రూపొందించి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకు సమర్పించారు. ఆయా ప్రతిపాదనలకు విద్యాశాఖ ఆమోదించగా, టెట్ నిర్వహణకు మార్గం సుగమమైంది. వివరాలకు www://tstet.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.