బీజేపీలోకి నటి జయసుధ

– క్రైస్తవుల తరపున ప్రాతినిథ్యం వహిస్తా.. జయసుధ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సినీ నటి జయసుధ బీజేపీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ చుగ్‌ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జయసుధకు పార్టీ కండువా కప్పి సభ్యత్వ రశీదును తరుణ్‌ చుగ్‌ అందిచారు. బుధవారం నాడిక్కడ బిజెపి ప్రధాన కార్యాలయంలో జరిగిన చేరిక కార్యక్రమంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ పాల్గొన్నారు. అంతకు ముందు కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షాతో సినీ నటి జయసుధ సమావేశమయ్యారు. పార్టీలో చేరే అంశంతోపాటు పలు కీలక అంశాలపై చర్చించారు. పార్టీలోకి జయసుధ రావడం సంతోషంగా ఉందని, ఆమెకు స్వాగతం పలుకుతున్నానని తరుణ్‌ చుగ్‌ తెలిపారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందిందని, బీజేపీలో చేరాలని ఏడాది కాలం నుంచి అనుకుంటున్నానని జయసుధ తెలిపారు. మతం, కులం పరంగా కాకుండా ప్రజలకు సేవ చేయాలని బీజేపీలో చేరానని జయసుధ చెప్పారు. క్రైస్తవుల తరపున కూడా ప్రాతినిథ్యం వహిస్తానని ఆమె అన్నారు. ”ప్రధాని విధానాలు నచ్చి బీజేపీలో చేరుతున్నారు. అమిత్‌ షాను కలిశా. పని చేయాలనే తపనతోనే బీజేపీలోనే చేరు తున్నా. జయసుధగా, ప్రజలకు మంచి చేయాలనే జాతీయ పార్టీలో చేరాను. క్రైస్తవుల గొంతు వినిపిస్తూనే ఉంటా” అని జయసుధ అన్నారు. ”జయసుధ కు మనస్ఫూర్తిగా ఆహ్వానం పలు కుతున్నా. జయసుధ చేరిక పార్టీ కి మరింత ఉత్సాహం. కుటుంబ, అవినీతి, నియంతృత్వ పాలన పోవాలని, ప్రజాస్వామ్య పాలన రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే బీఆర్‌ఎస్‌ ఓడిపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. బస్తీలా అభివృద్ధిపై జయసుధకు చిత్తశుద్ధి ఉంది” అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు.