– హ్యాట్రిక్ విజయంపై కిషన్రెడ్డి ఆశలు
– జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ముద్ర
– కొత్త మంత్రివర్గంలో చోటుపై గంపెడాశలు
– కేసీఆర్ మొదటి ప్రకటనలోని అభ్యర్థిత్వం ఖరారు
– హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఎన్నికల సమరానికి సీఎం కేసీఆర్ అందరికంటే ముందే సిద్ధమయ్యారు. తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చారు. ఇక ఏ క్షణాన ఎన్నికలు నిర్వహించినా ఎదుర్కొనేందుకు పార్టీ అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. ఇక ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు తన మార్క్ రాజకీయాలతో పార్టీ అభ్యర్థులను ముందుగానే ప్రకటించారు. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నంలో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి మొదటి విడతలోనే ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సహాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంచిరెడ్డి కిషన్రెడ్డిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. మంచిరెడ్డి కిషన్రెడ్డి నాలుగో సారి బరిలో నిలుస్తుండటంతో గెలుపుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఈ సారి గెలిస్తే నూతన ప్రభుత్వం ఏర్పడితే.. ఆ కొత్త మంత్రివర్గంలో తనకు చోటు వస్తుందన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా మంచిరెడ్డికి ముంద్ర ఉంది. కేసీఆర్ మొదటి ప్రకటనతోనే అభ్యర్థి ఖరారు కావడంతో ప్రచారంలోకి వెళ్లడమే తరువాయి అన్నట్లుగా మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.
2023 డిసెంబరులోగా ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్ సంకేతాలతో అధికార బీఆర్ఎస్ పార్టీ ముందుగానే ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. కేసీఆర్కు కలిసి వచ్చే సంఖ్యలతో ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. అందులో రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై ఉన్న అపోహలను పటాపంచలు చేస్తూ మరోసారి మంచిరెడ్డి కిషన్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. ఇక నాలుగో సారి మంచి బరిలో దిగనున్నారు. ఇబ్రహీంపట్నం ఎస్సీ రిజర్వేషన్ నుంచి జనరల్ స్థానంలోకి మారిన తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం టీడీపీ అభ్యర్థిగా బరిలోకి నిలిచారు. సీపీఐ(ఎం) మద్దతుతో ఆయన విజయం సాధించారు. అనంతరం 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన ఎన్నికల్లోనూ మరోసారి టీడీపీ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. 2015 మే నెలలో ఆయన కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రధానంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్లు ఆ సందర్భంగా ప్రకటించారు. ఇబ్రహీంపట్నానికి సాగునీరు తేవడమే లక్ష్యంగా ఆ రోజు ప్రకటించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ బలపర్చిన బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డిపై 376 స్వల్ప ఓట్ల తోనే బయటపడ్డారు. ఇక త్వరలోనే జరగనున్న ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గత సంవత్సర కాలంగా మంచిరెడ్డి కిషన్రెడ్డి ఎన్నికల వాతావరణ తలపించే విధంగా కార్యక్రమాలు చేపట్టారు. విజయం తనసొంతం అన్నట్లుగా తన ప్రచార పర్వాన్ని కొనసాగించారు. ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి సుమారు మూడు మాసాల పాటు నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరిస్తూనే.. వచ్చే ఎన్నికల్లో మరోసారి మంచిరెడ్డి కిషన్ రెడ్డిని గెలిపించాలని ఆ సందర్భంగా నియోజవర్గాన్ని చుట్టారు. ఇదే తరుణంలో నియోజకవర్గ కేంద్రంలో యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రభుత్వ ఆకాంక్షలు ప్రజల్లోకి తీసుకుపోయారు.
మంచిరెడ్డి కిషన్ రెడ్డి బయోడేటా
మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్వగ్రామమైన ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడులో 1953 ఏప్రిల్ 11వ తేదీన జన్మించారు. నిజాం కళాశాలలో బీఏ వరకు విద్యాభ్యాసం చేశారు. చిన్నతనంలోనే రాజకీయాల్లో అరంగేట్రం చేసిన కిషన్ రెడ్డి 1982లోనే సర్పంచ్గా పోటీ చేసి విజయం సాధించారు. 1982 నుంచి 1985 వరకు గ్రామ సర్పంచిగా పని చేశారు. 1985 నుంచి 1990 వరకు సొసైటీ చైర్మన్గా, డీసీసీబీ డైరెక్టర్గా పని చేశారు. 2002 నుంచి 2004 వరకు టీడీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పని చేశారు. అదే విధంగా 1994 నుంచి 2004, 2012 నుంచి 2015 వరకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. 2001 నుంచి 2004 వరకు మలక్పేట అసెంబ్లీ టీడీపీ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2009 నుంచి ఇబ్రహీంపట్నం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.
ఇబ్రహీంపట్నంలో భారీ ర్యాలీ
మరోసారి మంచిరెడ్డి కిషన్రెడ్డిని ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటించడంతో ఆ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. ఆయన సతీమణి ముకుంద రెడ్డిని యువజన విభాగం కార్యకర్తలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇబ్రహీంపట్నం క్యాంపు కార్యాలయం నుంచి ఇబ్రహీంపట్నం వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్రెడ్డిని మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకుంటామని నినాదాలతో హౌరెత్తించారు.