స్మారక చిహ్నం తుది పనుల పరిశీలన

నవతెలంగాణ-హైదరాబాద్‌
హుస్సేన్‌సాగర్‌ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ఫినిషింగ్‌ పనులను శని వారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పరిశీలిం చారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరుగుతూ అధికారులకు, వర్క్‌ ఏజెన్సీకి పలు సూచనలు చేశారు. ప్రధాన ద్వారం, ఫౌంటైన్‌, ల్యాండ్‌ స్కేప్‌ ఏరియా, గ్రీనరీ, పార్కింగ్‌ ఏరియా, నిర్మాణ లోపలి భాగంలో ఆర్ట్‌ గ్యాలరీ, ఆడియో విజువల్‌ రూమ్‌పై అంతస్తుకు వెళ్లేందుకు ఎస్కలేటర్‌ ఏర్పాటు, లిఫ్ట్‌లు పరిశీలించారు. కన్వెన్షన్‌ సెంటర్‌, పైన రెస్టారెంట్‌ పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 22న సీఎం కేసిఆర్‌ చేతుల మీదుగా తెలంగాణ అమర వీరుల స్మారక చిహ్నం ప్రారంభించుకోనున్న నేపథ్యంలో మిగిలిన ఫినిషింగ్‌ వర్క్స్‌ వేగంగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేయాలని ఆదేశించారు. అమరుల త్యాగాలు ప్రతిబింబించేలా నిరంతరం జ్వలించే జ్వాలా ఆకతి దీపం వద్ద లైటింగ్‌ను పరిశీలించి సూచనలు చేశారు. యావత్‌ తెలంగాణ ప్రజల మది నిండా నిలిచే నిర్మాణమని మంత్రి అన్నారు. మంత్రి వెంట ఆర్‌ అండ్‌ బీ ఈఏన్నీ ఐ. గణపతిరెడ్డి, సి.ఈ మోహన్‌నాయక్‌, ఎస్‌.ఈలు హఫీజ్‌, లింగారెడ్డి, ఎ.ఈ ధీరజ్‌ రెడ్డి, నిర్మాణ సంస్థ ప్రతినిధులు కొండల్‌ రెడ్డి, శిల్పి రమణారెడ్డి తదితరులు ఉన్నారు.