– సమ్మెబాట పట్టిన అంగన్వాడీ ఉద్యోగులు
– అరకొర వేతనాలతో ఇబ్బందులు
– ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆవిశ్రాంత పోరాటం
– జిల్లాలో 1600 అంగన్వాడీ కేంద్రాలు
– ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రభుత్వం
– పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు ఇచ్చే అవకాశం
అరకొర వేతనాలతో అంగన్వాడీలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆవిశ్రాంత పోరాటం నిర్వహిస్తున్నారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏండ్ల తరబడి వారిది ఒకే నినాదం. ప్రభుత్వాలు ఎన్ని మారిన వారి వెట్టి చాకిరి మాత్రం మారడం లేదు. ప్రతి సంవత్సరం దశల వారీగా ఉద్యమాలు చేయడం, చివరకు సమ్మెబాట పట్టడం, ప్రభుత్వం ఏదో ఒక హామీ ఇవ్వడం, తరువాత విస్మరించడం పరిపాటిగా మారుతోంది. చేసేది లేక చివరకు సమ్మెబాట పడుతున్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అదే జరుగుతోంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని సోమవారం నుంచి సమ్మెబాట పట్టారు. దాంతో అంగన్వాడీలకు తాళం పడింది.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమ డిమాండ్ల సాధనకు సమ్మెబాట పట్టారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చాలీచాలని గౌరవ వేతనాలతో సంవత్సరాల తరబడి తమ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న హామీలు, హామీగానే మిగిలిపోతున్నాయి. ప్రతి సారి చేస్తున్న సమ్మె సందర్భంగా ప్రభుత్వం వారిని మోసం చేస్తూనే ఉంది. దాంతో సోమవారం నుంచి పూర్తి స్థాయి సమ్మెలోకి వెళ్లారు.
ఏండ్ల నుంచి చేస్తున్న గౌరవ వేతనమే..
సంవత్సరాలుగా పని చేస్తున్న తమకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనంపై ఆధారపడి అంగన్వాడీ టీచర్లు, అయాలు కాలం వెళ్లదీస్తున్నారు. అంగన్వాడీ టీచర్లకు పౌష్టికాహారం అందజేయడంతో పాటు అదనపు కార్యక్రమాలను కూడా ప్రభుత్వం అప్పగిస్తోంది. కోవిడ్ మహమ్మారి విజృంభించిన విధి నిర్వాహన తప్పలేదు. టేక్ హౌం ద్వారా పౌష్టికాహారాన్ని అందించారు. నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగడం లేదు. సమ్మెకు వెళ్లే ప్రతీ సమయంలోనూ ప్రభుత్వం హామీలు ఇస్తూ వాటిని అమలుకు నోచుకోవడం లేదు. అంగన్వాడీ టీచర్లకు రూ.13,650, అయాలకు రూ.7,600 మాత్రమే గౌరవ వేతనం చెల్లిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.1300 పెంచినా రాష్ట్ర ప్రభుత్వం వాటా పెంచడం లేదు. ఈ పరిస్థితుల్లోనే తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టాల్సి వచ్చిందని అంగన్వాడీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. రూ.26వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత, గ్రాట్యుటీ, హెల్త్ కార్డులు, వేసవిలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు, కేంద్రాలకు పక్కా భవనాలు, మౌలిక వసతులు వంటివి కల్పించడంతో పాటు అంగన్వాడీ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ల పరిష్కారం కోసం ఇటీవల అధికారులకు సమ్మె నోటీసు అందజేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
అంగన్వాడీలకు తాళం…
తమ డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సమ్మెలోకి వెళ్లడంతో కేంద్రాలకు తాళం పడింది. పిల్లలకు అందజేసే పౌష్టికాహారానికి బ్రేక్ పడనుంది. జిల్లాలోని 1600 అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మీ ద్వారా 19689 మంది గర్భిణులు, బలింతులు, 7 నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలో 80196 మంది, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు 23,576మందికి బాలామృతం, 16 కోడిగుడ్లు టేక్ హౌం రేషన్గా చిన్నారులకు అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసించే పిల్లలకు ప్రతీరోజు ఒక పూట సంపూర్ణ భోజనం, కోడి గుడ్డు, పాలు, పప్పు, కూరగాయల భోజనంతో పాటు కుర్కురేలు, స్నాక్స్ ద్వారా అందిస్తున్నారు. వీటికి బ్రేక్పడింది.
తాళాలు ఇవ్వాలని జీపీ కార్యదర్శుల నుంచి బెదిరింపులు
అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సమ్మెలోకి వెళ్లారు. పంచాయతీ కార్యదర్శుల ద్వారా బెదిరింపులకు గురి చేస్తుంది. సమ్మెలోకి వెళ్లిన అంగన్వాడీ టీచర్లకు పలువురు పంచాయతీ కార్యదర్శులు సోమవారం ఫోన్లు చేసి అంగన్వాడీ కేంద్రాల తాళాలు, ఇతర సరుకులు అప్పగించాలని ఒత్తిడి తెచ్చారు. అంటే ప్రభుత్వం ఈ బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించినట్టు అర్థమవుతోంది. టీచర్లు సమ్మెలోకి వెళ్లడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే గ్రామ పంచాయతీ కార్యదర్శులను సూపర్వైజర్లుగా బాధ్యతలు అప్పగించి కేంద్రాలను నడిపించే ఏర్పాట్లు చేస్తోంది. దాంతో టీచర్లు తాళాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.
రంగారెడ్డిలో 1600 కేంద్రాలు
రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాల పరిధిలోని 7 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో మొత్తం 1600 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 1380 మేజర్ కేంద్రాలున్నాయి. 220 మిని కేంద్రాలున్నాయి. ఆమన్గల్ ప్రాజెక్టు కింద 232 కేంద్రాలు, చేవెళ్ల ప్రాజెక్టులో 255, హయత్నగర్ ప్రాజెక్టులో 181, ఇబ్రహీంపట్నం ప్రాజెక్టులో 162, మహేశ్వరం ప్రాజెక్టులో 234, శేరిలింగంపల్లి ప్రాజెక్టులో 220, షాద్నగర్ ప్రాజెక్టు పరిధిలో 316 కేంద్రాలున్నాయి. మొత్తం 1560 మంది టీచర్లు పనిచేస్తున్నారు. మరో 40 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక 1380 మంది ఆయాలు ఉండాల్సి ఉంటే, వీరలో 1268 మంది మాత్రమే పని చేస్తున్నారు. మరో 112 ఆయా పోస్టులు ఖాళీలున్నాయి. నేడు 1828 మంది అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె బాటపట్టారు.
డిమాండ్లను పరిష్కరించాలి
తమ డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సమ్మెలోకి వెళ్లారు. ప్రభుత్వానికి గతం నుంచి వినతులు ఇస్తూనే వచ్చాము. సకాలంలో పరిష్కరించాలని కోరాము. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరకు సమ్మెలోకి వెళ్లక తప్పలేదు. ప్రభుత్వం కాలయాపన చేయకుండా సమ్మెను విరమింజేసేందుకు చొరవ చూపాలి.తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి.
– రాజ్యలకిë అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు