నవతెలంగాణ – ఇంఫాల్ : మణిపూర్లో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని తెంగ్నౌపల్ జిల్లాలో భద్రతాదళాలు, సాయుధ దుండగుల మధ్య శుక్రవారం ఉదయం కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 6గంటలకు పల్లెల్ ప్రాంతంలో ప్రారంభమైన కాల్పులు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. రెండు రోజుల క్రితం బిష్ణుపూర్ జిల్లాలోని ఫౌగాక్చావో ఇఖారు, క్వాక్తా వద్ద సుమారు పది వేల మంది మొయితీలు బారికేడ్లు తొలగించాలని ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. మణిపూర్ ఇంటిగ్రిటీ కో- ఆర్డినేషన్ కమిటీ (కొకొమి) పిలుపు మేరకు వారు ఆందోళన చేపట్టారు. అడ్డుకున్న భద్రతా బలగాలపై రాళ్లు రువ్వారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్ను ప్రయోగించాల్సి వచ్చిందని అన్నారు. ఆ ముందు రోజు మణిపూర్లోని ఐదు లోయ జిల్లాల్లో కర్ఫ్యూ విధించినట్లు అధికారులు తెలిపారు.