ఆందోళన చేస్తే అరెస్టులు చేస్తారా?

– బీఆర్‌ఎస్‌ సర్కారుపై రేవంత్‌ ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కాంగ్రెస్‌ నాయకుల అక్రమ అరెస్టుల పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్‌ 2 పరీక్షలు వాయిదా వేయాలంటూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికితే, ప్రజల పక్షాన ఆలోచించాల్సిన పాలకులు…నియంతల్లా ప్రవర్తిస్తున్నారని ఒక ప్రకటనలో విమర్శించారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రియాజ్‌ను మఫ్టీ పోలీసులు తన కోచింగ్‌ సెంటర్‌లో అరెస్ట్‌ చేసి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు బలమూరి వెంకట్‌ను అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారని తెలిపారు. విద్యార్థుల సమస్యల కోసం ప్రజాస్వామిక పోరాటం చేస్తున్న నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అని అభిప్రాయపడ్డారు. అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రూప్‌ 2 విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.లేదంటే కాంగ్రెస్‌ పార్టీ పక్షాన, విద్యార్థులకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని హెచ్చరించారు.