ఢిల్లీ విమానాశ్రయంలో

– రూ.10 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత
ఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్‌ చరిత్రలోనే తొలిసారిగా రూ.10 కోట్ల విలువైన విదేశీ నోట్లను పట్టుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురు తజికిస్థాన్‌ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. లగేజీలో ఉంచిన బూట్లలో విదేశీ కరెన్సీని దాచి ఉంచినట్లు సమాచారం. నిందితులు ఇస్తాంబుల్‌కు విమానం ఎక్కేందుకు వెళ్తుండగా అధికారులు అడ్డుకున్నారు. వారి బ్యాగేజీని చెక్‌ చేయగా.. కట్టల కొద్దీ నోట్లు బయటపడ్డాయి. వాటిని లెక్కించగా.. రూ.10.6 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు కస్టమ్స్‌ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని, విచారణ జరుగుతోందని చెప్పింది. భారతదేశంలోని ఓ విమానాశ్రయంలో తొలిసారిగా ఇంత పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. అధికారులు అదుపులోకి తీసుకున్న ముగ్గురిలో ఓ మైనర్‌ కూడా ఉన్నాడని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.