బ్యాంకు ఖాతాను ఎన్‌పీసీఐకి లింక్‌ చేయాలి

– జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల
నవతెలంగాణ-ఖమ్మంరూరల్‌
పీఎం కిసాన్‌ నగదు జమ కోసం అన్నదాతలు తమ బ్యాంకు ఖాతాను ఎన్‌పిసీఐ (నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)కి లింక్‌ చేయాలని జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల అన్నారు. మండల పరిధిలోని కాచిరాజుగూడెం, ముత్తగూడెం గ్రామాల్లో రైతులకు గురువారం పోస్టాఫీసులో ఖాతాలను ప్రారంభించి ఎన్‌పిసీఐకి లింక్‌ చేయించారు. ఈ సందర్భంగా విజయనిర్మల మాట్లాడారు. పీఎం కిసాన్‌ నగదు కోసం రైతులు తమ బ్యాంకు ఖాతా, పోస్టాఫీసు ఖాతాను తప్పనిసరిగా ఆధార్‌తో పాటుగా ఎన్‌ పిసీఐకి లింక్‌ చేయాలన్నారు. లింక్‌ చేయకపోతే పీఎం కిసాన్‌ నగదు జమకాదన్నారు. కార్యక్రమంలో ఏడీఏ విజయచంద్ర, ఏవో నాగేశ్వరరావు, ఏఈవోలు ఆదర్శ్‌, నజ్మాకౌసర్‌ తదితరులు పాల్గొన్నారు.