మహేష్బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న మరో చిత్రం ‘గుంటూరు కారం’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అటు ప్రేక్షకుల్లోను, ఇటు మహేష్బాబు అభిమానుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని మేకర్స్ దీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ప్రతీ అప్డేట్ని ఎంతో వినూత్నంగా ప్రజెంట్ చేసేందుకు మేకర్స్ రంగం సిద్ధం చేశారు. తాజాగా ఈ చిత్రంలోని ‘ఓ మై బేబీ..’ అంటూ సాగే సెకండ్ సింగిల్ని ఈనెల 13న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఆదివారం ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ పాట ప్రోమోతో పాటు మహేష్బాబు, శ్రీలీల రొమాంటిక్ మూడ్లో ఉన్న పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. కుటుంబ ప్రేక్షకులు మెచ్చే మాస్, యాక్షన్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రం ఈనెలాఖరు నాటికి చిత్రీకరణ పూర్తి చేసుకోనుంది. ఈ సినిమాకి సంగీతం : తమన్, ఛాయాగ్రహణం : మనోజ్ పరమ హంస.