ఈ ఏడాది సెప్టెంబర్లో విడుదలైన ‘సప్త సాగరాలు దాటి సైడ్ ఎ’ విశేష ఆదరణ పొందింది. దీంతో ‘సప్త సాగరాలు దాటి సైడ్ బి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కన్నడలో రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. హేమంత్ రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ మరియు చైత్ర జె. ఆచార్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా ఈనెల 17న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో హీరో రక్షిత్ శెట్టి మాట్లాడుతూ, ‘తెలుగు ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. తెలుగులో ఇంత ఘనంగా విడుదల చేస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి, వివేక్కి కతజ్ఞ్ఞతలు’ అని అన్నారు. ‘తెలుగు రాష్ట్రాల్లో సైడ్ ఎ’కి వచ్చిన స్పందన పట్ల మేం చాలా సంతోషంగా ఉన్నాం. సైడ్ ఎ తో పోలిస్తే, సైడ్ బి షేడ్ కాస్త భిన్నంగా ఉంటుంది. ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఎన్నో ఫోన్లు, మెసేజ్లు చేసి ప్రశంసిస్తున్నారు’ అని దర్శకుడు హేమంత్ రావు చెప్పారు.
నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ, ”సైడ్ ఎకి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఊహించిదానికంటే మంచి వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా సైడ్ ఎ కంటే పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.