నవతెలంగాణ – అమరావతి
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నంద్యాలలో టీడీపీ అధినేతను అరెస్టు చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఆమె రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి సైతం నిరవధిక నిరాహార దీక్షలో కూర్చున్నారు. ఈ క్రమంలో పోలీసులు శనివారం తెల్లవారుజామున ఆమె దీక్షను భగ్నం చేశారు. అనంతరం, నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అఖిలప్రియను పోలీసులు ఆళ్లగడ్డలోని ఆమె నివాసానికి తరలించారు. ఇంట్లోకి వెళ్లేందుకు నిరాకరించిన ఆమె పోలీసుల వాహనంలోనే దీక్ష కొనసాగిస్తానని పట్టుబడ్డారు. ఈ క్రమంలో అఖిలప్రియ, విఖ్యాత్రెడ్డికి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు జరిపించిన అనంతరం ఆమె నివాసానికి తరలించారు. కాగా, పోలీసుల తీరుపై మాజీ ఎంపీ అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను బలవంతంగా తీసుకొచ్చి ఇంటిదగ్గర వదిలేశారని ఆరోపించారు. తమ నిరవధిక నిరాహార దీక్షను ఆపే ప్రసక్తే లేదని, ఇంటి నుంచే కొనసాగిస్తామని చెప్పారు. తనకు, తన తమ్ముడికి ఆరోగ్య సమస్యలు వస్తే దానికి నంద్యాల ఎస్పీ, డీఎస్పీ బాధ్యత వహించాలని అన్నారు.