నవతెలంగాణ-హైదరాబాద్ :
‘మోడీ ఇంటి పేరు’ కేసులో శిక్ష పడిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి.. సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు పడిన రెండేళ్ల శిక్షపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఈ కేసులో గరిష్ఠ శిక్ష విధించేందుకు ట్రయల్ జడ్జి ఎటువంటి కారణం చెప్పలేదు. ఈ క్రమంలో దోషిగా నిర్ధారించే తీర్పును నిలిపేయాలి. ఈ తరహా వ్యాఖ్యలు మంచివి కావన్న విషయంలో సందేహమే లేదు. ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తి బహిరంగ ప్రసంగాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అందరూ ఆశిస్తారు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో తాను నిర్దోషినని, తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని రాహుల్ గాంధీ.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కేసు విచారణ చేపట్టింది.
రాహుల్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. పరువు నష్టం దావా వేసిన, గుజరాత్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ అసలు ఇంటిపేరు ‘మోడీ’ కాదని, ఆయన ఆ ఇంటిపేరును తర్వాత పెట్టుకున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రాహుల్ గాంధీ నేరస్థుడు కాదని, బీజేపీ కార్యకర్తలు గతంలోనూ ఆయనపై అనేక కేసులు వేసినప్పటికీ.. ఏ కేసులోనూ శిక్ష పడలేదని సింఘ్వీ వాదించారు. పార్లమెంటుకు హాజరయ్యేందుకు, ఎన్నికల్లో పోటీ చేసేందుకుగానూ.. రాహుల్ గాంధీ నిర్దోషిగా విడుదలయ్యేందుకు ఇదే చివరి అవకాశమని తెలిపారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. ఆయనకు పడిన రెండేళ్ల శిక్షపై తాజాగా స్టే విధించింది.