నవతెలంగాణ – అహ్మదాబాద్: అతి తీవ్ర తుఫాను బిపర్జాయ్ గుజరాత్ తారాన్ని తాకింది. గురువారం రాత్రి కచ్ ప్రాంతంలోని లఖ్పత్ సమీపంలో తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గుజరాత్ తీరంలో భీకర గాలులు వీస్తున్నాయి. కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తున్నది. తుఫాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. బిపర్జాయ్ తుఫాను కేంద్రం దాదాపు 50 కిలోమీటర్ల వ్యాసంతో ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో పది రోజులకుపైగా కొనసాగిన తొలి తుఫానుగా ఇది నిలిచిపోతుందన్నారు. కాగా, గుజరాత్లోని తీరప్రాంతాల్లో బిపర్జాయ్ తుఫాను బీభత్సం సృష్టిస్తన్నది. బలమైన ఈదురుగాలుల ధాటికి వందల సంఖ్యలో చెట్లు నేలకొరుగుతున్నాయి. ఇండ్లు కూలిపోతున్నాయి. సౌరాష్ట్ర, కచ్ తీరాలతోపాటు ద్వారకలోని గోమతి ఘాట్, దమణ్ ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగామారింది. భీకర గాలులతో కచ్ జిల్లాలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక మోర్బీ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతోపాటు 115 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో చెట్లు కూలిపోగా, 300 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయని అధికారులు తెలిపారు. దీంతో సుమారు 45 గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయన్నారు. తుఫాను కారణంగా ఇద్దరు మరణించగా, 22 మంది గాయపడ్డారని తెలిపారు.