![బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/it-rules.jpg)
నవతెలంగాణ ముంబయి: నకిలీ, తప్పుడు సమాచార వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ నిబంధనలపై బాంబే హైకోర్టు విచారిస్తూ ‘ఒక చీమను చంపేందుకు సుత్తిని వాడలేం కదా..?` అని కీలక వ్యాఖ్యలు చేసింది. బాంబే హైకోర్టు వ్యాఖ్యలు ఆ నిబంధనల తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఆన్లైన్ కంటెంట్లో నకిలీ, తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకుగాను ఫ్యాక్ట్చెక్ యూనిట్ను తీసుకువస్తామని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్లో పేర్కొంది. ఇందుకోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021కు సవరణలు చేసింది. అయితే, ఈ కొత్త నిబంధనలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఐటీ నిబంధనల చెల్లుబాటును సవాల్ చేస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మ్యాగజైన్స్.. బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. దీనిపై బాంబే డివిజనల్ బెంచ్ విచారణ జరుపుతోంది.
సోషల్ మీడియాలో నకిలీ సమాచారాన్ని కట్టడి చేసేందుకు తేలికైన మార్గాలు కూడా ఉన్నాయంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టులో తమ వాదనలు వినిపించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ‘ఫ్యాక్ట్ చెకింగ్ ఉండాలి. కొంతస్థాయి వరకు సోషల్ మీడియా కంటెంట్ను ఫ్యాక్ట్ చెక్ చేయాలి. అయితే ఈ నిబంధనలు మితిమీరినవని మీరు చెప్పిన మాట సరైంది కావొచ్చు. ఒక చీమను చంపడానికి సుత్తిని వాడటం ఎంతవరకు సమంజసం..?’ అని ఆ నిబంధనల తీవ్రతను ప్రశ్నించింది. ‘ఈ ఐటీ నిబంధనలకు సవరణ చేయాల్సిన అవసరం ఏంటో ఇప్పటికీ అర్థం కాలేదు?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘అలాగే నకిలీ, తప్పుదోవపట్టించే సమాచారాన్ని నిర్ణయించేందుకు ప్రభుత్వంలోని ఒక సంస్థకు పూర్తిస్థాయి అధికారాలను కట్టబెట్టడం కష్టం. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంది. దానికి సమాధానం ఇవ్వడం ప్రభుత్వం విధి’ అని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే ఫ్యాక్ట్ చెక్ యూనిట్ను ఎవరు ఫ్యాక్ట్ చేస్తారని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. నకిలీ, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ఎలా నిర్ణయిస్తారనే దానిపై స్పష్టత లేదని చెప్పింది.