అక్రమ మైనింగ్‌లో బ్రిజ్‌ భూషణ్‌

 Brij Bhushan in illegal mining– విచారణ జరపనున్న ఎన్‌జీటీ
న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌ గుర్తున్నారా? మహిళా మల్లయోధులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం, ఆయనపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రెజ్లర్లు రాజధానిలో రోజుల తరబడి నిరసన తెలపడం గుర్తుండే ఉంటుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఆయన అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని ఫిర్యాదులు వచ్చాయి. ఇందులోని వాస్తవాలను తెలుసుకొని, తగిన చర్యలు చేపట్టేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కేసర్‌గంజ్‌ ఎంపీ అయిన బ్రిజ్‌ భూషణ్‌ గోండా జిల్లా తరాబ్‌గంజ్‌ తాలూకాలోని మజ్హరాత్‌, జైత్‌పూర్‌, నవాబ్‌గంజ్‌ గ్రామాలలో అక్రమ మైనింగ్‌ జరిపారని హరిత ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు అందింది. ‘భూమి నుంచి ఖనిజాలను తవ్వి, వాటిని ట్రక్కులలో నింపుతున్నారు. ఇలా ప్రతి రోజూ 700కు పైగా ట్రక్కులను అక్రమంగా రవాణా చేస్తున్నారు. వాటిని నిల్వ చేసి, అక్రమంగా విక్రయిస్తున్నారు. ఇలా 20 లక్షల క్యూబిక్‌ మీటర్లను అమ్మేశారు. సామర్ధ్యానికి మించి ట్రక్కులను ఖనిజాలతో నింపి తరలించడం వల్ల పట్‌పర్‌ బ్రిడ్జికి, రోడ్డుకు నష్టం వాటిల్లుతోంది’ అని ఆ ఫిర్యాదులో వివరించారు. జ్యుడీషియల్‌ మెంబర్‌ జస్టిస్‌ అరుణ్‌ కుమార్‌ త్యాగి, నిపుణుడు ఎ.సెంథిల్‌ వేల్‌తో కూడిన హరిత ట్రిబ్యునల్‌ బెంచ్‌ ఫిర్యాదును పరిశీలించి అందులో పర్యావరణానికి సంబంధించిన పలు ప్రశ్నలు లేవనెత్తారని వ్యాఖ్యానించింది. వాస్తవాలను తెలుసుకొని, అవస రమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయిం చింది. వారానికి ఒకసారి సమావేశం కావాలని, మైనింగ్‌ జరిగే ప్రదేశాన్ని సందర్శి ంచాలని కమిటీని ఆదేశించింది. నిబంధనలకు అనుగుణంగా మైనింగ్‌ జరుగుతు న్నదీ లేనిదీ ఈ కమిటీ తెలుసుకుంటుంది. రెండు నెలల్లో నివేదికను అందజే స్తుంది. ఫిర్యాదుపై తదుపరి విచారణను నవంబర్‌ 7వ తేదీన చేపడతారు.