నవతెలంగాణ– ఉత్తర్ప్రదేశ్: అంబులెన్స్ అందుబాటులో లేక సోదరి మృతదేహాన్ని ఓ యువకుడు బైక్పై ఇంటికి తీసుకెళ్లిన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని ఔరైయా జిల్లాలో బుధవారం జరిగింది. జిల్లాలోని నవీన్ బస్తీలో నివాసం ఉంటున్న ప్రతాప్ సింగ్ కుమార్తె అంజలి.. ఆన్ చేసి ఉన్న వాటర్ హీటర్ను ప్రమాదవశాత్తు తాకింది. కొద్దిసేపటికే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆమెను బిధునా ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే అంజలి మరణించినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. అంజలి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఆరోగ్య కేంద్రం సిబ్బందిని ఆమె సోదరుడు కోరాడు. అయితే అక్కడ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో అంజలి మృతదేహాన్ని దుప్పటితో చుట్టి బైక్పై ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానికులు.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది.