నవతెలంగాణ – జనగామ
జనగామ జిల్లాలో రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణ మిస్సింగ్ మిస్టరీ విషాదంగా ముగిసింది. గత మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణ దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం ఆయన మృతదేహాన్ని పోలీసులు చంపక్ హిల్స్ శివారులో గుర్తించారు. భూ వివాదంలో రామకృష్ణను సుపారీ గ్యాంగ్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. రామకృష్ణను దుండగులు తొలుత కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.