నవతెలంగాణ – రాయపర్తి
వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని బంధనపల్లి గ్రామ శివారులోని దుర్గమ్మ ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగినట్లు స్థానికులు తెలిపారు. తండా వాసుల వివరాల మేరకు దుర్గమ్మ ఆలయాన్ని 2021 సంవత్సరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో ఉత్సవాలను నిర్వహించుకున్నట్లు వివరించారు. ఆరాధ్య దైవంగా కొలుచుకునే ఆలయంలో గుర్తు తెలియని దుండగులు గుడి గేటుకు ఉన్న తాళాని పగలకొట్టి ఆలయంలోకి ప్రవేశించి హుండీని ఎత్తుకెళ్లారన్నారు. హుండీని ఆలయంలో తెరవకుండా గుడి సమీపంలోని వ్యవసాయ పొలంలోకి తీసుకువెళ్లిన తరువాత పగలకొట్టి అందులోని నగదును దొంగిలించి హుండీని అక్కడే పడేసి వెళ్లిపోయారన్నారు. హుండీలోని కానుకలను రెండు సంవత్సరాల నుండి లెక్కించలేదని అందులో సుమారు ఒక లక్ష రూపాయల పైనే నగదు ఉండొచ్చని గ్రామస్థులు అంచనా వేస్తున్నారన్నారు.