– రక్షణ చట్టం కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం
– రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో పైళ్ల ఆశయ్య
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
రజక వృత్తిదారుల రక్షణ చట్టం కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపట్టాలని తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య అన్నారు. వృత్తిదారులపై సామాజిక వివక్ష, దాడులు పెరిగిపోయాయనీ, సామాజికంగా చిన్న చూపు చూడబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రజక వృత్తిదా రుల సంఘం రెండ్రోజుల రాష్ట్ర స్థాయి చైతన్య సభల వర్క్షాప్ ముగింపు కార్యక్రమం ఉపాధ్యక్షులు చిటికెన ముసలయ్య అధ్యక్షతన శుక్రవారం హైద రాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రజక వృత్తిదారులపై 44చోట్ల దౌర్జన్యాలు, మహిళలపై 14 అత్యాచారాలు, సామాజిక దాడులు జరిగాయని వివరించారు. రజకులకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైం దని విమర్శించారు. 40 ఏండ్లుగా అమల్లో ఉన్న రజక ఫెడరేషన్కు పాలక మండళ్ళు వేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తూ, వాటిని రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గృహలక్ష్మి పథకం నిరుపేద వృత్తిదారులకు వర్తించేలా అవకాశాలు కల్పించాలనీ, 50 ఏండ్లు నిండిన రజక వృత్తిదారులకు పెన్షన్ ఇవ్వాలనీ, వీరనారి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు పీ సోమయ్య, అన్నారుపు వెంకటేశ్వర్లు, ఎదునూరి మదర్, సీ మల్లేష్, జ్యోతి, ఉపేందర్, కంచర్ల కుమారస్వామి, మంజుల, బాగ్యా తదితరులు పాల్గొన్నారు.