నవతెలంగాణ – భువనేశ్వర్: ఒడిశా రైలు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది. అయితే, ఇదంతా ఉద్దేశపూర్వకమేనా? దీని వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా? వెలికితీసేందుకు సీబీఐ ఇప్పటికే రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే దుర్ఘటన చోటుచేసుకున్న బాహానగా బజార్ రైల్వేస్టేషన్ను తాజాగా సీల్ చేసింది. అంతకుముందే స్టేషన్ లాగ్ బుక్, రిలే ప్యానెల్, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో.. బాహానగా బజార్ స్టేషన్లో ఏ రైళ్లూ ఆగవని రైల్వే అధికారులు శనివారం వెల్లడించారు. సాధారణ రోజుల్లో భద్రక్- బాలేశ్వర్, హావ్డా- భద్రక్, ఖరగ్పూర్- ఖుర్దా రోడ్ తదితర ఏడు ప్రయాణికుల రైళ్లతోపాటు అవసరమైన సందర్భాల్లో గూడ్సు రైళ్లు ఇక్కడ ఆగేవి. ‘లాగ్ బుక్, రిలే ప్యానెల్, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్న అనంతరం బాహానగా బజార్ రైల్వేస్టేషన్ను సీబీఐ సీల్ చేసింది’ అని రైల్వే అధికారులు తెలిపారు. ‘రిలే ఇంటర్లాకింగ్ ప్యానెల్ను స్వాధీనం చేసుకున్నందున సిగ్నలింగ్ వ్యవస్థను నిర్వహించేందుకు స్టేషన్ సిబ్బందికి అవకాశం లభించదు. ఈ నేపథ్యంలో.. తదుపరి నోటీసులు వచ్చే వరకు స్టేషన్లో ప్రయాణికుల, గూడ్సు రైళ్లు ఆగవు’ అని వెల్లడించారు.