నవతెలంగాణ- శాయంపేట : శాయంపేట గ్రామంలోని మహమ్మద్ రైస్ మిల్లు నుండి ఎస్టి కాలనీ వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టం పనులు పూర్తి కావడంతో గురువారం రాత్రి లైటింగ్ సిస్టంను విద్యుత్ సిబ్బంది ఎట్టకేలకు ప్రారంభించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతిలు మాందారి పేట నుండి ప్రగతి సింగారం వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. దీంతో స్థానిక నాయకులు, ప్రజలు సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తే బాగుంటుందని గండ్ర దంపతుల దృష్టికి తీసుకురాగా, ఎమ్మెల్యే 25 లక్షల నిధులు కేటాయించగా, జడ్పీ చైర్ పర్సన్ జ్యోతి జెడ్పీ నిధుల నుండి 25 లక్షల నిధులు కేటాయించారు. 50 లక్షల నిధులతో సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయగా, ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో విద్యుత్ సిబ్బంది గురువారం రాత్రి లైటింగ్ సిస్టన్ని ప్రారంభించారు. సెంట్రల్ లైటింగ్ సిస్టం వెలుగులతో మండల కేంద్రంలో వెలుగులు జిగేలుమన్నాయి. గురువారం నుండి రోడ్డు డివైడర్ పనులు కూడా ప్రారంభం కావడంతో శాయంపేట గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేసిన గండ్ర దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.