బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3 చందమామ దిశగా సాగుతోంది. చంద్రయాన్-3 భూమి చుట్టూ తన కక్ష్యలను విజయవంతంగా పూర్తి చేసిందని, ప్రస్తుతం చంద్రునిపైకి వెళుతుందని ఇస్రో మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం ట్రాన్స్లూనార్ కక్ష్యలోకి చంద్రయాన్-3ను ప్రవేశపెట్టామని, ఈ నెల 5న చంద్రుడి కక్ష్యలోకి చేరుకుంటుందని ఇస్రో ట్వీట్ చేసింది. ఈ నెల 23న చంద్రయాన్-3ను చంద్రుడిపై ల్యాండ్ చేయాలని ఇస్రో ప్రణాళికలు వేస్తుంది. జులై 14న శ్రీహరికోట నుంచి చంద్రయాన్-3ను ప్రయోగించిన సంగతి తెలిసిందే.