– మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి
నవతెలంగాణ-మెదక్
కేసీఆర్ ఆశీస్సులతో మెదక్ నియోజకవర్గాన్ని మరింత అభివద్ధి చేస్తానని, ఆడ బిడ్డలా ఆదరించి ఆశీర్వదించాలని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని సీఎస్ఐ చర్చి ప్రాంగణంలో మంత్రి హరీశ్ రావు సమక్షంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మెదక్ ప్రాంతంలోని ఎంఎన్, ఎఫ్ఎన్ కెనాల్కు నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్దే అని, ఘనపురం ఆనకట్ట లైనింగ్కు రూ.100 కోట్ల నిధులు ఇచ్చి, మంజీరా, హల్ది మీద చెక్ డ్యాంలు ఇచ్చిన ఘనత కేసీఆర్దే అని తెలిపారు. బీఆర్ఎస్ రైతుల కోసం ఏర్పడిన ప్రభుత్వమని తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు కాళేశ్వరం జలాలు అంది పంటలు సస్యశ్యామలమయ్యే విధంగా హామీ ఇవ్వాలని కేసీఆర్ను కోరారు. రాబోయే కాలంలో ఇచ్చిన హామీ మేరకు మెదక్కు రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కావాలనే ప్రజల కోరికను నెరవేర్చాలని సీఎంను కోరారు. సీఎం కేసీఆర్ మెదక్కు రూ. 50 కోట్ల నిధులను మంజూరు చేసి అనేక రకాల పథకాలను అమలుచేయడం జరిగిందని తెలియజేశారు. కొందరు ఆఫీసులు తరలిపోతున్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారని, పద్మక్క ఉన్నంత వరకు ఏ ఒక్క ఆఫీసు తరలిపోయే పరిస్థితి రానివ్వదని స్పష్టం చేశారు. జిల్లా కార్యాలయాలు ఏర్పాటు, మెడికల్ కళాశాల, రామాయంపేట డివిజన్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. కేసీఆర్ బిడ్డలా భావించి మరోసారి ఆదరించి ఆశీర్వదించాలని నియోజకవర్గాన్ని మరింత అభివద్ది చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే పద్మ కోరారు.