నవతెలంగాణ – హైదరాబాద్: భారత భూభాగాన్ని చైనా లాక్కుందని రాహుల్ గాంధీ విమర్శించారు. లడఖ్ పర్యటనలో ఉన్న యువనేత శుక్రవారం కార్గిల్లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ… చైనా మన భూభాగాన్ని లాక్కుందని ప్రతి ఒక్కరికీ తెలుసునని, కానీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం అంగుళం భూమి కూడా తీసుకోలేదని పూర్తిగా అబద్దపు ప్రకటన చేస్తున్నారని ధ్వజమెత్తారు. జోహన్నెస్బర్గ్లో జరుగుతున్న బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సంభాషించుకున్నారు. అనంతరం రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తొమ్మిది రోజుల లడఖ్ పర్యటనలో చివరి రోజైన శుక్రవారం బహిరంగ సభలో మాట్లాడారు. రాహుల్ మాట్లాడుతూ.. తాను గత వారం రోజులుగా తన మోటార్ సైకిల్పై లడఖ్ మొత్తాన్ని సందర్శించానని, లడఖ్ ఒక వ్యూహాత్మక ప్రదేశమన్నారు. తాను ప్యాంగోగ్ సరస్సు వద్ద ఉన్నప్పుడు, చైనా వేల కిలోమీటర్ల భారత భూమిని లాక్కున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. దురదృష్టవశాత్తు, ప్రతిపక్ష సమావేశంలో ప్రధాని మోదీ మాత్రం మన భూమిలో ఒక్క అంగుళం కూడా తీసుకోలేదని ప్రకటన చేయడం పూర్తిగా అబద్ధమన్నారు.