నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా అమరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో బుధవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ గురువారం జరిగే అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అన్ని జిల్లాలలో అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించాలనీ, గ్రామాలలో ఉన్న అమర వీరుల స్థూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటించాలని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను సమన్వయంతో విజయవంతం చేసినందుకు కలెక్టర్లను, వివిధ విభాగాల అధికారులను, ప్రభుత్వ సిబ్బందిని సీఎస్ అభినందించారు. ప్రతి గ్రామంలో ఉదయం 11 గంటలకు సమావేశమై అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటించాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులలో శ్రద్ధాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించాలని, నిర్ణీత ఫార్మాట్లో అమరుల సంస్మరణ తీర్మానాలు చేయాలని ఆమె తెలిపారు. రాష్ట్రంలోని అన్ని విద్యాలయాల్లో ప్రార్థనా సమావేశాల్లో అమరుల స్మతిలో రెండు నిమిషాలు మౌనం పాటించి, వారి త్యాగాలను ప్రస్తుతించాలని సీఎస్ తెలిపారు.