నవ తెలంగాణ- నవీపేట్
మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ న్యాలకంటి అబ్బన్న తీరుపై దర్యాపూరు రైతులు ఎమ్మార్వో వీర్ సింగ్ కు బుధవారం ఫిర్యాదు చేశారు. నవీపేట్ మండల కేంద్రంలోని దర్యాపూర్ శివారు రైల్వే గేట్ సమీపంలో గత మూడు రోజులుగా ధాన్యం తూకం చేయడం లేదని సొసైటీకి వెళ్లి కొందరు రైతులు ప్రశ్నించగా సొసైటీ చైర్మన్ అబ్బన్న గల్లా పట్టి బయటకు నూకేస్తా, పోలీసులకు చెబుతానని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఎమ్మార్వో వీర్ సింగ్ కు ఫిర్యాదు చేశారు. కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులకు సహకరించాల్సిన సొసైటీ చైర్మన్ రైతులను ఇలా అవమానించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. రైతులపై దురుసుగా ప్రవర్తించిన చైర్మన్ పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు.