– పోటీ చేసే స్థానాలపై సీపీఐ(ఎం) దృష్టి
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంపై సీపీఐ(ఎం)రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. పోటీ చేసేందుకు పార్టీని సమాయతం చేస్తోంది. ఇప్పటికే ప్రజా ఉద్యమాలను ఉధృతం చేసింది. ఇండ్ల స్థలాలు, భూ పోరాటాలు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, పంచాయతీ కార్మికుల పోరాటాలకు పదును పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ(ఎం) కేంద్రీకరించే స్థానాల్లో ఇబ్రహీంపట్నం ఒకటి కూడా కావడం అందుకు బలం చేకూరుస్తోంది. కాగా, అధికార పార్టీతో ఎన్నికల అవగాహన బెడిసిన నేపథ్యంలో వామపక్షాలతో కలిసి పోటీకి సిద్ధమవుతోంది. ప్రజాపోరాటాలతో పునాది వేసిన ప్రాంతం ఇబ్రహీంపట్నం స్థానంపై రాష్ట్ర పార్టీ కేంద్రీకరణ ప్రజా పోరాటాలు, కార్మిక వర్గ ఉద్యమాలతో మమేకం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇటీవల ఆ పార్టీ నిర్వహిస్తున్న పోరాటాలు పోటీకి సంకేతాలుగా కన్పిస్తున్నాయి. ఇండ్ల స్థలాలు, ఉపాధి హామీ అమలు, భూపోరాటాలు, రెవెన్యూ సమస్యలు, విద్యార్థి ఉద్యమాలు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక ప్రజాపోరాటాలు సాగాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతాంగ వ్యతిరేక మూడు చట్టాలను రద్దును నిరసిస్తూ బలమైన పోరాటాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 6,7 తేదీల్లో గ్రామగ్రామాన నిరసనలు వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కారం కావాలంటే సీపీఐ(ఎం) వంటి పార్టీ మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించడం అవసరమని ప్రజలు బావిస్తున్నారు. 2004లో విజయం సాధించిన తరువాత మొదటి సారిగా ఇబ్రహీంపట్నంలోని అన్ని గ్రామాలకు కృష్ణా జలాలు తాగునీరుగా సరఫరా చేయాలని ఇబ్రహీంపట్నం నుండి 10వేల మందితో నిర్వహించిన చలో అసెంబ్లీ పాదయాత్రతో కృష్ణాజలాలు సాధించారు. కందుకూర్, మంచాల, మహేశ్వరం మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల సాధనలో సీపీఐ(ఎం) కృషి ఆమోగం. 2009కి ముందు వరకు ఎస్సీగా ఉన్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి కందుకూర్, మహేశ్వరం మండలాలు విడిపోయి అబ్దూల్పూర్మేట్ మండలం కలిసింది. దీంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం జనరల్ స్థానంగా మారింది. అప్పుడు అయిదు మండలాల్లో ఓటర్ల సంఖ్య 1,89,964 ఉండగా, ప్రస్తుతం నాలుగు మండలాలే ఈ నియోజకవర్గంలో 3,01,497 మంది ఓటర్లున్నారు. 2009తో వామపక్షాలు, టీడీపీ కూటమిలో టీడీపీకి కేటాయించారు. ఈ ఎన్నికల్లో వామపక్షాలు బలపర్చిన టీడీపీ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్రెడ్డి విజయం సాధించారు. అటు నుంచి 2014 కూడా కిషన్రెడ్డి విజయం సాధించగా, 2015లో టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరారు. 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 72,581 ఓట్లు సాధించారు. ఆయన సమీప ప్రత్యార్థి బీఎస్పీ అభ్యర్థి మల్రెడ్డి రంగారెడ్డి 72,205 ఓట్లు సాధించి ఓటమిపాలయ్యారు.
ఇబ్రహీంపట్నంలో పోరు తీరుతెన్నులు..
1957 నుంచి 1987వరకు వరుసగా మూడు పర్యాయాలు కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నికయ్యారు. తరువాత మూడు పర్యాయాలు మార్క్సిస్టులు ఆధిక్యత సాధించారు. నియోజకవర్గ అభివృద్ధిలో వారి పాత్రకీలకం. అందులో రెండు సార్లు సీపీఐ(ఎం) నుండి కొండిగారి రాములు విజయం సాధించగా, మూడోసారి మస్కు నర్సింహా విజయ దుందుభి మోగించారు. 1957 నుండి 1987 వరకు కాంగ్రెస్ అభ్యర్థి ఎంఎన్ఎన్ నర్సయ్య ఎమ్మెల్యేగా సారధ్యం వహించారు. ఇప్పటి వరకు జనరల్గా ఉన్న ఈ స్థానాన్ని 1952 నుండి ఎస్సీ రిజర్వు చేశారు. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్, కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికయ్యారు. తరువాత కమ్యూనిస్టులు రెండు పర్యాయాలు ఏకదాటిగా విజయం సాధించారు. 1952 నుండి 1983 వరకు కాంగ్రెస్ తిరుగులేని విధంగా ఆధిక్యత చెలాయించినప్పటికీ 1985లో పట్టు కోల్పోయింది. 1985 ఎన్నికల్లో టీడీపీ, 1989ఎన్నికల్లో సీపీఐ(ఎం) పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. 1983 విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి ఏజీ కృష్ణ 1989 ఎన్నికల్లో ఓటమి చవి చూశారు. ఇబ్రహీంపట్నం స్థానాన్ని 1978 నుండి 1989 వరకు ఎస్సీలకు రిజర్వు చేశారు. 6.4.1981న జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎజి కృష్ణ ఎన్నికయ్యారు. తరువాత జరిగిన సాధారణ ఎన్నికల్లో 1989-1994 వరకు మార్క్సిస్టులు విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో టీడీపీ పుష్పలీల, కాంగ్రెస్ అభ్యర్థి ఏజీ కృష్ణపై విజయం సాదించారు. 2004 ఎన్నికల్లో మరోసారి సీపీఐ(ఎం) మస్కు నర్సింహా, టీడీపీ అభ్యర్థి నర్రా రవికుమార్పై విజయబావుట ఎగరేశారు. ఇప్పటి వరకు ఎస్సీగా ఉండగా, నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో జనరల్గా మారింది. 2009, 2014ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిషన్రెడ్డి విజయం సాధించారు. ఇక 2018లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్రెడ్డి విజయం సాధించారు.
పోరాటాలకు పదును…
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రజా పోరాటాలకు సీపీఐ(ఎం) పదును పెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలు ఉధృతం చేస్తుంది. ఆశావర్కర్లు, అంగన్వాడీ, అసంఘటితరంగ కార్మికుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తుంది. ఇండ్ల స్థలాల కోసం అబ్ధుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం మండలాల్లో పేదలు ప్రభుత్వం భూ ఆక్రమణలు చేశారు. గతంలో ఇచ్చిన ఇండ్ల స్థలాల పట్టాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అబ్ధుల్లాపూర్మెట్ మండలంలో జరిగిన ఇండ్ల పోరాటంపై ప్రభుత్వం నిర్బంధం విధించింది. ఇక ఇబ్రహీంపట్నం మండలంలోని రామోజీ ఫిలింసిటీలో రాయపోల్, పోల్కంపల్లి, నాగన్పల్లి, ముకునూర్ గ్రామాల పేదలు మరోసారి భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. తమకు కేటాయించిన ఇండ్ల స్థలాల్లోనే ఇండ్లను నిర్మించుకుంటామంటున్నారు. ఇక దండుమైలారం గ్రామ అనుబంధమైన హఫీజ్పూర్ రెవెన్యూలో పేదలకు 1972-73లో జారీ చేసిన అసైన్ పట్టాలకు హక్కులు కల్పించాలని ధర్నాలు నిర్వహించారు. ఇక సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక హక్కుల పరిరక్షణకు విస్తృత పోరాటాలు సాగుతున్నాయి. అంగన్వాడీ, ఆశా వర్కర్లు, పంచాయతీ, మున్సిపల్ కార్మికుల పోరాటాలు ఉధృతమవుతున్నాయి.