నవతెలంగాణ- హైదరాబాద్: విప్లవ కవి, రచయిత, ప్రజా గాయకుడు గద్దర్ (అలియాస్ విఠల్ రావు) గుండెకు సంబంధించిన సమస్యలతో హాస్పిటల్లో చేరి చికిత్సపొందుతూ ఈరోజు మరణించారు. గద్దర్ మరణం పట్ల సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటిస్తున్నది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాజన పాదయాత్ర సందర్భంగా మరియు టి`మాస్ వేదిక ఆధ్వర్యంలో జరిగిన అనేక సభలలో ఆయన పాల్గొని ప్రజా ఉద్యమాలకు మద్దతిచ్చారు. అణగారిన వర్గాలకోసం అనేక పాటలు రాయడంతో పాటు తన ఆట, పాట ద్వారా ‘ప్రజా యుద్ధనౌక’గా పేరుపొందారు. ఆయనపై హత్యాయత్నం సందర్భంగా ఇప్పటికీ వెన్నెముకలో తూటా ఉన్నా ఖాతరుచేయకుండా ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై తన గళాన్ని వినిపించారు. నాటి నైజాం నవాబు దాష్టీకాలను ఎండగడుతూ ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చిన ‘బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి’ పాట నేటికీ చిరస్థాయిగా నిలిచింది. ఆయన వేషధారణ ప్రజలను ఆకర్షించేది. ప్రభుత్వం, మావోయిస్టుల మధ్య జరిగిన శాంతి చర్చలలో కీలకపాత్ర పోషించారు. గద్దర్ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు గద్దర్ మరణం పట్ల సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం సంతాపం వ్యక్తం చేసారు.